ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ – ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా ధీటైన పోరాటం
అమరావతి:
ప్రభుత్వ పాఠశాలల విధానాల్లో జరుగుతున్న మార్పులపై నిరసన వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదిక పేరిట ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. UTF, STU, APTF-257, APTF-1938, YSRTA, PRTU, APTA, APUS, AP HMA వంటి 9 Notified సంఘాలు కలిసి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాయి.
ఈ ఐక్యవేదిక విద్యాశాఖ తీసుకుంటున్న పాలసీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ నెల 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి, 23న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
ప్రధాన డిమాండ్లు:
ఈ సంఘాలు 16 ముఖ్యమైన డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో జరిగే చర్చలను బహిష్కరించి, తమ ఆందోళనను అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి సమక్షంలోనే చర్చలు జరగాలని, గత 30 వారాలుగా జరుగుతున్న చర్చలు కేవలం ఫార్మాలిటీగా మారాయని పేర్కొన్నారు.
• ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తి ప్రకారం 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. • ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయం. • తెలుగుతోపాటు ఉర్దూ, ఒడియా తదితర మైనర్ మాధ్యమాలను కొనసాగించాలి. తగిన సిబ్బందిని కేటాయించాలి. • ఫౌండేషన్, బేసిక్ పాఠశాలల్లో 41 మంది ఉంటే మూడో పోస్టు ఇవ్వాలి. ఏప్రిల్ 23న విద్యార్థుల సంఖ్యను పరి గణనలోకి తీసుకోవాలి. • పోస్టులను బ్లాక్ చేయకూడదు. హేతుబద్దీకరణలో సీనియర్ సమ్మతిస్తే పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాలి. • మండల విద్యాధికారులకు బదిలీలు చేపట్టాలి. కోరుకున్న ఎంఈఓ-1, ఎంఈఓ-2లకు హెచ్ఎం కన్వర్షన్ ఇవ్వాలి.. పీహెచ్ కోటాలో ప్రాధాన్య కేటగిరి ఉన్న వారికి ప్రాథమిక పాఠశాలల్లో 40%, ఉన్నత పాఠశాలల్లో 50% ఖాళీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనే నిబంధన తొలగించాలి.
SALT ప్రాజెక్టుపై విమర్శలు:
ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం తరహాలో ప్రపంచ బ్యాంకు ఆదేశాల ఆధారంగా అమలు చేస్తున్న సాల్ట్ పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మరింత దెబ్బతింటోందని విమర్శించారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలే సమస్యలకు మూలంగా పేర్కొన్నారు.
ఈ ఉద్యమం ద్వారా ఉపాధ్యాయ సంఘాలు విద్యావ్యవస్థను పరిరక్షించాలన్న సంకల్పంతో, తమ హక్కులను నిలబెట్టుకునే దిశగా మరోసారి ముందుకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్రంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించాయి.